సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి
సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి
గిద్దలూరు ఫిబ్రవరి 11:- గిద్దలూరు మండలం వీఠమూసారపల్లెలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సగిలేరు వాగులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. వీరంతా వరుసకు అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీఠమూసారపల్లె గ్రామానికి చెందిన సారె పెదవెంకట సుబ్బయ్య, వెంకట సుబ్బయ్య అన్నదమ్ములు. వీరి ఇద్దరి కుమార్తెలు వెంకటదీప్తి(13), సుప్రియ(14)లు గురువారం తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి వరుసకు సోదరి అయిన సుస్మిత(10), మరో బాలుడితో కలిసి సరదాగా గడిపేందుకు తమ పొలాలకు వద్దకు వెళ్లారు కాసేపు అక్కడే ఆహ్లాదంగా తిరిగారు.కొద్దిసేపటి తర్వాత చేతులను శుభ్రం చేసుకోవడానికి సమీపంలోని సగిలేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ ముగ్గురు బాలికలు వాగులో జారిపడ్డారు. ఇదంతా గమనించిన బాలుడు కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న వారి తల్లిదండ్రులు బాలికలను గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ముగ్గురు బాలికలు మృతి చెందినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గిద్దలూరు పోలీసులు తెలిపారు.