మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్

హైదరాబాద్: మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఆమెతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని అఖిల ప్రియ తెలిపారు. తన భర్త కిడ్నాప్ చేయించే వ్యక్తి కాదని.. భార్గవ్కు కిడ్నాప్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేయలేదని.. తనకు కొంత సమయం ఇస్తే అన్ని విషయాలు మీడియాకు తెలుపుతానన్నారు. ఒక వైపు వాదనలు విని… తమపై తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు. మీడియా అంటే తమ కుటుంబానికి చాలా గౌరవం ఉందని.. త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు.ఇదిలా ఉంటే, బోయినపల్లిలో కిడ్నాప్కు గురైన ముగ్గురు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. నార్సింగిలో ముగ్గురిని కిడ్నాపర్లు వదిలి పారిపోయారు. దీంతో ప్రవీణ్, నవీన్, సునీల్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. వీరు సీఎం కేసీఆర్ సోదరి తరఫు సమీప బంధువులు. వీరు ముగ్గురూ సీఎం కేసీఆర్ పీఏ వేణుగోపాలరావుకు బావమరుదులు. గత రాత్రి 11 గంటల సమయంలో సినీఫక్కీలో హకీ క్రీడాకారుడు ప్రవీణ్రావు కిడ్నాప్కు గురయ్యాడు. ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డ కిడ్నాపర్లు.. భూమా అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రవీణ్రావు సహా ఇద్దరు సోదరులను దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాప్కు గురైన ప్రవీణ్, నవీన్, సునీల్లను వికారాబాద్లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అఖిలప్రియ భర్త భార్గవ్రామ్ సోదరుడు చంద్రహాస్ పోలీసుల అదుపులో ఉన్నారు. హాఫీజ్పేటలోని వంద కోట్ల విలువైన భూమి కోసం కొంతకాలంగా గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.