ప్రేమోన్మాది ఘాతుకం: డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు : నరసరావుపేటలో దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులో ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థిని తోటి విద్యార్థి గొంతు నులిమి చంపేశాడు. వివరాలు.. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష అనే యువతి నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు. కాగా అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు.
ఈ క్రమంలోనే అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన యువకుడు పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ దగ్గర అనూషను గొంతు నులిమి దారుణంగా హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో నిందితుడు విష్ణువర్ధన్ లొంగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.