ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదు నిమ్మగడ్డ
కర్నూల్ వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకగ్రీవాలపై పలు పార్టీల నేతలు గవర్నర్ను కలిశారని తెలిపారు. ఏకగ్రీవాల కోసం ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరం లేదని నిమ్మగడ్డ తప్పుబట్టారు. పత్రికల్లో ప్రకటన ఇచ్చిన అధికారులను వివరణ కోరామని తెలిపారు. ఎస్ఈసీకి తెలియకుండా ప్రకటనలు ఎలా ఇస్తారు? అని నిమ్మగడ్డ ప్రశ్నించారు. సామరస్యంగా ఏకగ్రీవాలు చేయడం సరైన సంస్కృతి అని వ్యాఖ్యానించారు. బలవంతం చేసి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయడం సరికాదని విమర్శించారు. భిన్నాభిప్రాయాల నుంచి ఏకాభిప్రాయం సాధించడమే ప్రజాస్వామ్యమన్నారు.అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏకగ్రీవాలకు ప్రయత్నించే వారిపై.. అధికారులు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల్లో అనవసరంగా జోక్యం చేసుకుని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని ఆయన సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసేవారిని హౌస్అరెస్ట్ చేస్తామని నిమ్మగడ్డ రమేష్కుమార్ హెచ్చరించారు.